Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వరం మీద ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం మాకు ఉంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పీసీ ఘోష్ కమిషన్కు అదనపు సమాచారం అందించిన అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
కమిషన్ను కలిసి అదనపు సమాచారం అందించాం. కమిషన్ నిన్న సమయం ఇచ్చారు. నిన్న కేసీఆర్కు వైద్య పరీక్షలు ఉన్న నేపథ్యంలో రాలేకపోతున్నాను అని కమిషన్ను రిక్వెస్ట్ చేయగా అంగీకరించారు. వారిచ్చిన సమయం ప్రకారం, ఈరోజు కమిషన్ను కలిసి మా వద్ద ఉన్న అదనపు సమాచారం అందించాం. మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొని మా వద్ద ఉన్నంత మేరకు కమిషన్కు స్పష్టమైన సమాచారం ఇచ్చామని హరీశ్రావు తెలిపారు.
మేం ఇప్పుడు ప్రభుత్వంలో లేము. డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం వద్ద ఉంటాయి. సమాచారం కోసం చీఫ్ సెక్రెటరీ, జీఏడీ సెక్రెటరీ, ఇరిగేషన్ సెక్రెట్రరీ గారికి లేఖ రాశాను. ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ నోట్ వంటి సమాచారం కావాలని లేఖల రూపంలో అడిగాను. కాని వారి నుంచి స్పందన రావడం లేదు. మా వద్ద అందుబాటులో ఉన్న సమాచారం క్రోడీకరించి నోట్ రూపంలో ఇవ్వడం జరిగింది. మా సమాచారం అధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి. ఆరు సార్లు క్యాబినెట్ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు కమిషన్కు అందించాం. అంతే కాదు మూడు సార్లు శాసన సభ ఆమోదం కూడా పొందింది. ఎప్పుడెప్పుడు జరిగాయి, జరిగిన చర్చ, ఇతర అంశాలను కమిషన్కు అందించాం. లెజిస్టేచర్ అప్రూవల్ క్యాబినెట్ కంటే కూడా ఉత్తమం అయినటువంటిది. ఆరు సార్లు క్యాబినెట్ అప్రూవల్ వివరాలను, మూడు సార్లు అసెంబ్లీ ఆమోదం, చర్చ వివరాలను కమిషన్కు డాక్యుమెంట్లతో సహా అందించామని హరీశ్రావు తెలిపారు.
కమిషన్ ఆన్ గోయింగ్ కనుక ఆ వివరాలు బయట పెట్టలేను. సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా ఆ వివరాలు బయట పెడతాం.
ఇంతకు మించిన వివరాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాకు అడిగినా ఇవ్వడం లేదు. కమిషన్కు అందించిన సమాచారం మాకు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదు. పారదర్శకంగా ఉండాలనుకుంటే మాకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు. కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలను ఈ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం మాకు ఉంది అని హరీశ్రావు పేర్కొన్నారు.