Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతాంగానికి యూరియా సంక్షోభం వచ్చి పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. రైతు సమస్యలు పక్కనపెట్టి.. అసెంబ్లీలో బురద రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారు అని మండిపడ్డారు.
భారత దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ముందెన్నడూ లేదు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నరు. ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నరు. పండుగ లేదు.. పబ్బం లేదు.. వాన లేదు.. ఎండ లేదు.. రాత్రి లేదు.. పగలు లేదు క్యూలో నిలబడుతున్నరు. అలసి సొలసి పడిపోతున్నరు. ఓపిక లేక క్యూలో చెప్పులు, పాస్బుక్కులు, అట్ట డబ్బాలు, ఖాళీ సీసాలు, రాళ్లు పెట్టి రోజుల పాటు నిరీక్షిస్తున్నరు అని హరీశ్రావు తెలిపారు.
‘పత్తి పూత దశతో ఉంది.. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు’ అని ఒక రైతు. ‘వరి పొట్ట దశలో ఉంది.. యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం’ అని మరొక రైతు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతున్నది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి నిన్న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహమే నిదర్శనం.
ప్రభుత్వ యంత్రాంగం మీద అసహనంతో జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సి రావడమే కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం. ఎక్కడిక్కడ హైవేలెక్కి ధర్నాలు చేస్తున్న రైతన్నల ఆగ్రహ జ్వాలలే నిదర్శనం. ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభం అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
యూరియా అడిగిన పాపానికి రైతుల చెంపలు చెల్లుమనిపించిన సోకాల్డ్ ప్రజా పాలన ఇది. 22 నెలల పాలనలో యావత్ తెలంగాణ రైతాంగాన్ని నడి రోడ్డు మీదకు ఈడ్చిన దుర్మార్గ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డిది. కేసీఆర్ పాలనలో సకాలంలో సరఫరా అయిన యూరియాను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు. పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా? రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం ఏండి ఏం లాభం. కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో, సరఫరాలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం శోచనీయం. రాష్ట్రంలో రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుండం దారుణం. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరం వైఫల్యం. రైతు డిక్లరేషన్ అని దగా చేసారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో పచ్చి మోసం చేసారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కన్నీళ్లు పెట్టిస్తున్నరు. అరిగోస పెడుతున్నరు. జై కిసాన్ అని నాటి కాంగ్రెస్ అంటే, నై కిసాన్ అని నేటి నేటి రేవంతు అంటున్నడు అని హరీశ్రావు నిప్పులు చెరిగారు.
బిజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం తప్ప చేస్తున్నదేం లేదు.
బిజేపీ, కాంగ్రెస్ నిర్లక్ష్యం వైఖరి రైతాంగానికి మరణశాసనంగా మారింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించడంతో ఆయిల్ ఫాం రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లై బాధ పడుతున్నారు. ఇక యూరియా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి వల్ల రైతులు కంటి నిండా నిద్ర పోని పరిస్థితి. ఇన్ని సమస్యలు రైతులను చుట్టుముడుతున్నా ఇక్కడి బిజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు ఉలుకు లేదు, పలుకు లేదు. 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణకు చేస్తున్నది ఏమున్నది. ఏమీ లేదు. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని, పత్తిపై ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని యదావిధిగా కొనసాగించాలని.. ఈ మేరకు ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనికి మాలిన డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
లేదంటే యూరియా కోసం రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు. .