సుబేదారి, డిసెంబర్ 12: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝాను కోరారు. ఈ మేరకు మంగళవారం వినయ్భాస్కర్.. మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్, కార్పొరేటర్లతో కలిసి హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్కు వెళ్లి సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం.. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసిందని, ఇందులో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని 2018లో ప్రారంభించిందని తెలిపారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయిని రాజేందర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పూ జలు చేసిన అనంతరం.. ఆయన అనుచరులు దౌర్జన్యంగా క్యాంపు కార్యాలయ ప్రారంభ శిలాఫలకాన్ని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, ఇది చట్టవిరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ఎమ్మెల్యేగా 15 ఏండ్లు పనిచేసిన తాను, తన అనుచరులు ఏనా డూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.