న్యూఢిల్లీ, నవంబర్ 13: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా లేదన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐలు కౌంటర్ ఇచ్చారు. తాజా మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ఆదివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ కొలీజియం పనితీరు భేష్ అని, సమతూకంతో కూడినదని పేర్కొన్నారు.
మంత్రి రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని, కొలీజియం వ్యవస్థ ప్రతి కోణాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. పలు స్థాయుల్లో సమీక్ష చేశాకే న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం ఆమోదిస్తుందని తెలిపారు. మరో మాజీ సీజేఐ టీఎస్ ఠాకూర్ శనివారం మాట్లాడుతూ కొలీజియం వ్యవస్థను మెరుగపర్చవచ్చని, అయితే ప్రత్యామ్నాయం చూపకుండా విమర్శించడం వల్ల లాభం లేదని పేర్కొన్నారు.