సైదాబాద్, జూన్ 25 : సింగరేణిని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గురువారం సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్వీ నాయకులు పెద్ద ఎత్తున జైలుకు వద్దకు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆత్మీయ నాయకుడికి పూలదండలు అందజేసి పటాకులు కాల్చారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ సింగరేణిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నా 49శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. రూ.1,600 కోట్ల విలువైన 40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని ఆరోపించారు.
మాజీ మంత్రి హరీశ్రావు వెళ్లినా ఆ నిల్వలు చూపించలేదని మండిపడ్డారు. నిజంగా బొగ్గు నిల్వలు ఉంటే అధికారులు ఎందుకు చూపించడం లేదని, దీనిపై రాష్ట్ర ప్రజలకు, సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలని సుమన్ డిమాంద్ చేశారు. సింగరేణిలో రూ.15వేల కోట్ల బొగ్గు కుంభకోణాలు జరిగాయని, రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డి పాత్రధారి అయితే రేవంత్ సూత్రధారి అని ఆరోపించారు.
విజిలెన్స్ విచారణ పేరుతో కార్మికులను ప్రభుత్వం వేధిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో గని కార్మికులకు పట్టాలు ఇచ్చామని, కార్మికుల సంక్షేమం కోసం అనేక ప్రయోజనాలు కల్పించామని గుర్తుచేశారు. సంస్థ ప్రైవేటీకరణ కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత కార్మికులు, ప్రజలపైనే ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు.
27రోజులు జైలులో ఉన్న తనను పరామర్శించిన మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తోపాటు బీఆర్ఎస్వీ నాయకులు, బెయిల్ వచ్చేందుకు కృషిచేసిన బీఆర్ఎస్ లీగల్ టీమ్ సభ్యులకు బాల్క సుమన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనకు కొండంత అండగా నిలిచిన చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు, సింగరేణి కార్మికులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, పల్లె రవికుమార్ పాల్గొన్నారు.