యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య కేసులో ఆధారాలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పిస్తామని యాదాద్రి జోన్ డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. బుధవారం ఆయన భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్యలకు సంబంధించి 36/24 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించామని, పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం దురదృష్టకరమని, విచారణ జరుగుతున్నప్పుడు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. అన్ని స్టేట్మెంట్లను వీడియోతీశామని, ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. సున్నితమైన విషయాలను బయటకు వెల్లడించలేమని, సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు.