వరంగల్: వరంగల్ను హెల్త్ హబ్గా మార్చే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ సెంట్రల్ జైలు తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జైలు స్థలంలో అత్యాధునిక వసతులతో మల్టీ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత వరంగల్ సెంట్రల్ జైలులోని ఖైదీలను ఇతర జైళ్లకు తరలించాలని ఆదేశించారు. ఈ మేరకు జైళ్ల శాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో వరంగల్ సెంట్రల్ జైలును పూర్తిగా ఖాళీ చేయనున్నట్లు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది చెప్పారు. సోమవారం ఆయన జైలులోని ఖైదీలు, అందులోని యంత్రాలు, పరికరాలు, సామగ్రి తరలింపు తీరు పరిశీలించారు. ఇప్పటివరకు 80 శాతం మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించామని.. మిగిలిన 231 మందిని మూడు రోజుల్లో పంపిస్తామని వివరించారు. రిమాండ్ ఖైదీలను మహబూబాబాద్, ఖమ్మం జైలుకు పంపిస్తున్నట్లు తెలిపారు. కారాగారంలోని మిషనరీని తరలింపు కూడా 75శాతం పూర్తయ్యిందని చర్లపల్లి, చంచల్గూడ జైలుకు పంపించామని అన్నారు.
వరంగల్ సెంట్రల్ జైలు పరిధిలో పనిచేస్తున్న పెట్రోల్ బంక్లపై ప్రజలకు నమ్మకం ఉందని, ఇందులో పనిచేస్తున్న 50మంది ఓపెన్ ఎయిర్ ఖైదీలకు ప్రత్యేక జైలు ఏర్పాటు చేసి ఇక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ జైలులో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది తరలింపుపై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ నగర శివారులోని మామునూరులో కొత్త జైలును అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వంద ఎకరాల్లో రూ.250 కోట్లతో కొత్త జైలును నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది చెప్పారు. మామునూరు సమీపంలోని బెటాలియన్ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో వరంగల్ సెంట్రల్ జైలును నిర్మించే ప్రతిపాదన ఉందని.. దీని కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారని తెలిపారు.