హైదరాబాద్: రాజ్యాంగం (Constitution) వల్లే భారతదేశం బలంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారని చెప్పారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి ఇంకా పోలేదని, ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. అందరూ తప్పనిసరిగా కరోనా టీకా వేయించుకోవాలని, రెండు డోసులు తీసుకోవాలని కోరారు. ‘కరోనా వ్యాక్సిన్పై ఇంకా కొందరికి అపోహలు ఉన్నాయి. టీకా తీసుకుంటేనే కొవిడ్ నుంచి మరింత రక్షణ ఉంటుంది. టీకా పొందినవారికి ఇన్ఫెక్షన్ సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోంది. వ్యాక్సిన్ తీసుకోనివారే 99 శాతం మంది ఐసీయూలో చేరుతున్నారు’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.