హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు చెప్పారు. వరల్డ్ హెల్త్ డేను పురస్కరించుకుని హైటెక్ సిటీలోని యశోద దవాఖాన ఆధ్వర్యంలో సోమవారం ‘రన్ ఫర్ హెల్త్’ పేరుతో 5కె రన్ నిర్వహించారు. దవాఖాన నుంచి ఐకియా వరకు నిర్వహించిన ఈ మెగా రన్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్షుడు రాజన్నతో కలిసి జీఎస్ రావు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యకరమైన జీవనశైలిని దూరం చేయడమే పరుగు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా ‘నా ఆరోగ్యం-నా హక్కు’ అనే నినాదాన్నే ఈ సంవత్సర థీమ్గా నిర్ణయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో 5,000 మందికిపైగా టీసీఎస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, యశోద వైద్యలు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.