హైదరాబాద్ : నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని రాష్ట్ర ఎలక్షన్ కమిషర్ సి.పార్థసారథి అన్నారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యలయంలో ‘అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2021’ ఇన్విటేషన్ని అభినయ థియేటర్ ట్రస్ట్ ప్రధాన సలహాదారు, రాష్ట్ర ఎలక్షన్ కమిషర్ సి.పార్థసారథి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ శతాబ్దంలో ఉజ్జయినిలో శూద్రకుడు ‘మృచ్చకటికం’ నాటకం రాశాడని చరిత్ర చెబుతోంది. అంతటి పురాతన చరిత్ర ఉన్న నాటక రంగం ఈ రోజు క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. కరోనా నాటకరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
మొత్తం కళారంగమే కుదేలు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చదువుకోనే పిల్లలకు నాటకం అలవాటు చేస్తే వారికి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని సూచించారు. పిల్లలకి నాటకం పట్ల అభిరుచి కలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. అభినయ రంగస్థల ట్రస్టు గత 16 సంవత్సరాలుగా (2006 నుంచి 2021 వరకు) థియేటర్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
రంగస్థల కళలను, కళాకారులను ప్రొత్సహించడంలో అభినయ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, అందుకు వారిని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అభినయ థియేటర్ ట్రస్ట్ అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్ పాల్గొన్నారు.