నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, జూన్ 8: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ మురికి కాలువలు శుభ్రపరుస్తుండటంతో, చెత్తా చెదారం తొలగిస్తుండటంతో పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ఆరో రోజైన బుధవారం కూడా ఉత్సాహంగా పనులు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గొల్లూరు, అమీర్పేట్, మన్సాన్పల్లి గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా క్రీడా ప్రాంగణాలు, రోడ్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, కలెక్టర్ అమోయ్కుమార్తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
అనంతరం మన్సాన్పల్లిలో మహిళా సంఘాలకు రూ.54 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. మన పల్లెలు దేశానికే ఆదర్శమన్నారు. మగ వాళ్లకు అప్పు పుట్టని చోట నేడు తెలంగాణలో మహిళలకు అప్పు లభిస్తుందని తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో హనుమాన్ తండాలో నిర్వహించిన పల్లె ప్రగతిలో జడ్పీ చైర్పర్సన్ కే విజయలక్ష్మితో కలిసి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. మొక్క నాటి నీళ్లు పోశారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్లతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొన్నారు. పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 9 గ్రామాలు తెలంగాణవి కావడం గర్వకారణమని వినోద్ పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్లోని 6వ డివిజన్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్తో కలిసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పట్టణ ప్రగతిని పర్యవేక్షించారు. పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని స్థానికులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సుభాష్నగర్, మండలంలోని రాంపూర్, మిర్ధాపల్లి, దేగాం, మచ్చర్ల గ్రామాల్లో నిర్వహించిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను, మురుగు కాలువలను పరిశుభ్రం చేశారు.
అధికారులపై స్పీకర్ పోచారం ఫైర్
‘ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతిని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు.. పట్టణ ప్రగతి అంటే ఇదేనా?’ అని మున్సిపల్ అధికారులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని బీడీ వర్కర్స్ కాలనీలో బుధవారం ఆయన పాల్గొన్నారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంపై మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. స్పీకర్ స్వయంగా డ్రైనేజీలోని చెత్తను తొలగించారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.