కరోనాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శగ్రామంగా ఎదగాలని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. గురువారం తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్లెప్రగతి, పచ్చదనం- పరిశుభ్రత ఒక జీవన విధానం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమం నిత్యం కొనసాగాలని, నర్సరీలు, మొక్కలను సంరక్షించాలని, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలను ఉపయోగంలోకి తేవాలని సూచించారు. కరోనా విజృంభిస్తున్నందున పారిశుద్ధ్యంపై మరింత దృష్టిసారించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ కార్యదర్శుల జీతాలు భారీగా పెంచినందున రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘనందన్రావు, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.