Telangana | నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లు.. దినదిన గండంగా గడిచిన బతుకులు.. వెరసి ఆకలిచావులు, వలసలు.. ఇదీ తొమ్మిదిన్నర ఏండ్ల కిందట తెలంగాణ బతుకు చిత్రం! ఇప్పుడు మండువేసవిలోనూ మత్తడి దుంకుతున్న చెరువులు.. ఎటు చూసినా పుట్లకొద్దీ ధాన్యం రాశులు.. కొత్త గా చిగురు తొడిగిన పల్లెలు!! వెనుకబాటుతనాన్ని చెరిపివేస్తూ నూతన చరిత్రను లిఖించుకునే దిశగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తనదైన చతురతతో ఓ ‘పథకం’ ప్రకారం చేసిన వ్యూహరచనలెన్నో దేశం మొత్తానికీ అభివృద్ధి పాఠాలు బోధిస్తున్నాయి. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంసరణలు, పథకాలపై పలు సందర్భాల్లో వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అంతేనా, పలు రాష్ర్టాలు అధ్యయనం చేసి తామూ ఆచరిస్తున్నాయి. మరికొన్ని రాష్ర్టాలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి.
పేదల, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు చిరునామాగా నిలుస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేస్తున్నారు. సంక్షేమ రంగంలో వినూత్న సంస్కరణలకు నాంది పలికారు. తెలంగాణ ప్రభుత్వం గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో దేశంలో ఎక్కడాలేని విధంగా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా, కనీవినీ ఎరుగని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, అనాథలు, లింగమార్పిడి వ్యక్తులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ ఏదో ఒక లబ్ధి చేకూర్చే పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. రాష్ర్టాన్ని విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో నూతన ఆవిష్కరణలకు చిరునామాగా మార్చారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్ల పంపిణీ, చేపల పంపిణీ, దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు లక్ష సాయం, మైనార్టీలకు లక్ష సాయం.. ఇలా చెప్పుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఉదాహరణగా నిలుస్తాయి.
ఒక పథకం.. బహుముఖ ఫలితాలు
కేసీఆర్ తెచ్చిన పథకాలన్నీ ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చడంతోపాటు పరోక్షంగా రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నాయి. ప్రతి పైసాకు రెట్టింపు ప్రతిఫలం దక్కుతున్నది. ఆసరా పింఛన్లతో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా దక్కి కుటుంబంలో ఆదరణ పెరిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడింది. మాతాశిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిపోయింది. గొర్రెలు, చేపల పంపిణీతో గొల్లకుర్మలు, మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్రంలో మాంసం, చేపల ఉత్పత్తి భారీగా పెరిగింది. గురుకుల విద్యాలయాల స్థాపన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్ట్గీల విద్యార్థులకు నవశకం మొదల య్యింది. డ్రాపౌట్స్ తగ్గి ఉన్నత చదువులు చదివే బాలికల సంఖ్య పెరిగింది. మైనార్టీ బాలికల విద్యలో దేశంలోనే తెలంగాణ నం.1గా నిలవటం గమనార్హం. మిషన్ కాకతీయ ద్వారా నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. దాంతో భూగర్భజలాలు పెరిగాయి. రెండు పంటలకు భరోసా ఏర్పడి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. దళితబంధు నిరుపేద దళితుల్లో కొత్త కాంతులను నింపుతున్నది. కూలీలను ఓనర్లుగా మార్చుతున్నది. ఇలా ప్రతి పథకం ఆశించిన స్థాయికి మించి సత్ఫలితాలను ఇస్తున్నది.
సాగునీటి పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకు ఎక్కింది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ విద్యార్థులు, శ్రీలంకలోని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు అధ్యయనం చేసి, దాని విశిష్టతలను ప్రపంచానికి చాటారు. నీతిఆయోగ్, నాబార్డ్, ఇక్రిసాట్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అధ్యయనం చేసి భేష్ అని కితాబిచ్చాయి. వైద్యారోగ్యం, ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధజలాలను అందించటంలో తొలిస్థానంలో నిలిచిన తెలంగాణ.. పచ్చదనం, పరిశుభ్రతలోనూ ముందు వరుసలోనే నిలిచి దాదాపు 75కు పైగా అవార్డులను సొంతం చేసుకున్నది.
దేశం అనుసరిస్తున్నది
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు యావత్తు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. రైతుబంధు దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది. ఆ పథకాన్ని కేంద్రం ఆదర్శంగా తీసుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రకటించింది. ఒడిశాలోనూ కాలియా పేరుతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. పశ్చిమబెంగాల్లో రైతుబంధు, రైతుబీమాను అమలుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్లు మార్చి అమలుచేస్తున్నది. మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, రుణమాఫీ, టీ-హబ్, అన్నపూర్ణ, టీఎస్ఐపాస్ను అమలు చేస్తామని కర్ణాటక ఎన్నికల్లో అకడి బీజేపీ ప్రకటించింది. రైతులు, మహిళల కోసం తెలంగాణ పథకాలను మరికొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు మన సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. ఇటీవలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి హర్ఘర్ నల్-హర్ఘర్ జల్ పథకాన్ని ప్రారంభించింది. బీసీలకు లక్ష సాయాన్ని కూడా కాపీ కొట్టిన కేంద్రం.. విశ్వకర్మ పేరిట అమలు చేస్తున్నది.
అన్ని వర్గాల నుంచి ప్రశంసలు
తెలంగాణ పథకాలకు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. ప్రధాని మోదీ మొదలుకొని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ప్రముఖ నిపుణులు, ఆర్థిక, వ్యవసాయ, సామాజికవేత్తలు మన పథకాలను వేనోళ్ల పొగిడారు. ప్రధాని మోదీ పార్లమెంటులో, మన్ కీ బాత్లో తెలంగాణ అభివృద్ధిని ప్రస్తావించారు. మిషన్ భగీరథ భేష్ అని కితాబిచ్చారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖమంత్రి అనంతకుమార్ హెగ్డే, కేంద్ర సామాజికన్యాయ, సాధికారత సహాయమంత్రి రాందాస్ అథవాలే, ఎస్ఎస్ అహ్లూవాలియా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, హర్షవర్ధన్, కిరణ్ రిజిజు, నరేంద్రసింగ్ తోమర్ తదితరులు సందర్భం వచ్చిన ప్రతిసారీ తెలంగాణ పథకాలపై ప్రశంసలు కురిపించారు.
రాష్ట్ర పథకాలపై విస్తృత అధ్యయనాలు
☞ మిషన్ భగీరథపై 9 రాష్ట్రాలు
☞ షీ టీం వ్యవస్థపై బెంగాల్ ప్రభుత్వం
☞ కంటివెలుగుపై ఒడిశా
☞ గొర్రెల పంపిణీపై తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక
☞ సాగు విధానాలపై రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్
☞ గురుకుల విద్యావ్యవస్థపై బీహార్
☞ పౌరసరఫరాల సంస్కరణలపై తమిళనాడు, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, శ్రీలంక
☞ ఇసుక పాలసీపై పంజాబ్
తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలి.
– కాగ్, నీతిఆయోగ్
తెలంగాణ మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ అద్భుతం. పట్టణాలపై అధ్యయనం, పరిశోధన చేసేవారికి, నిపుణులకు అవసరమైన సమాచారమంతా ఒకేచోట లభించేందుకు ఈ నాలెడ్జ్ సెంటర్ ఎంతగానో తోడ్పడుతుంది.
– నీతి ఆయోగ్
మిషన్ కాకతీయ అద్భుతమైన పథకం. తెలంగాణ కృషిని యావత్తు దేశానికి చాటాలని సంకల్పించా.
– వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్
తెలంగాణ పారిశ్రామిక విధానం గొప్పగా ఉన్నది. ఎన్నో ఏండ్ల నుంచి పారిశ్రామిక వేత్తగా ఉన్న తాను ఇలాంటి పారిశ్రామిక విధానాన్ని ఎక్కడా చూడలేదు.
– రతన్ టాటా
భూరికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్లు, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతుబంధు వంటి పథకాలు దేశానికి ఆదర్శం. వాటిపై అధ్యయనం చేసి దేశమంతా అమలు చేయాలి. పార్టీలు, వ్యక్తులకు అతీతంగా తనదైన పాలనతో కేసీఆర్ అన్ని వర్గాల మనసులను దోచుకున్నారు. తెలంగాణను దేశానికి మార్గదర్శిగా నిలిపారు.
– మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్
– మ్యాకం రవికుమార్