హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునే ఆయుధం మాస్క్ మాత్రమే అని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అప్రమత్తత అవసరం అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. అప్పుడే ఒమిక్రాన్ను అడ్డుకోవచ్చు అని తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్లో స్థానికులకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మొద్దు. ఆ వార్తలు వైరస్ కంటే ప్రమాదకరం. అప్రమత్తతో, జాగ్రత్తతో ఉండాల్సిన సమయమిది. తలనొప్పి, ఒళ్లు నొప్పితో పాటు నీరసం, దగ్గు, జలుబు రావడం ఒమిక్రాన్ లక్షణాలు. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పం.. కానీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో మాస్కును తప్పనిసరిగా ధరించడం అలవాటు చేసుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూనే.. వంద శాతం మాస్కు ధరించాలి అని విజ్ఞప్తి చేశారు.
కరోనా టెస్టుల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. వేలాదిగా హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేశామన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తతో ఉందని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.