హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : మీడియాలో అనేక మార్పులొస్తున్నా, మీడియా వ్యాపిస్తున్నా.. వార్తా పత్రికలదే హవా కొనసాగుతున్నదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్చార్డీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయెల్ అభిప్రాయపడ్డారు. జర్నలిజం, కమ్యూనికేషన్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయని తెలిపారు.
దక్షిణాఫ్రికా మీడియా నిపుణుల శిక్షణ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో సోమవారం ప్రారంభమయ్యింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరాన్ని శశాంక్ గోయెల్ ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణలో మొత్తం 29 మంది దక్షిణాఫ్రికా మీడియా నిపుణులు పాల్గొంటున్నారు.
మీడియా, కమ్యూనికేషన్ రంగంలో లోతైన పరివర్తన దశలో ఉన్నామని, ఇది మార్పు మాత్రమే కాదని.. ఇదొక విప్లవం అని ఆయన అభివర్ణించారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలు సమాచారాన్ని అందించే మూలాలుగా తయారయ్యాయని, మొత్తంగా సోషల్ మీడియా సూపర్ పవర్గా మారిందని చెప్పారు. కోర్సు డైరెక్టర్ మాధవి రావులపాటి, ప్రొఫెసర్ మహ్మద్ అబ్బాస్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.