హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): పాఠశాలలను మూసివేయాల్సిన అవసరం లేకుండానే హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క స్కూలు కూడా మూసివేయకుండా టీచర్లను సర్దుబాటును చేయాలని భావిస్తున్నది. విద్యార్థులు లేని స్కూళ్లకు కూడా ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టును కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. టీచర్ల హేతుబద్ధీకరణకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా జీవో- 25 జారీచేశారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది హేతుబద్ధీకరణ కోసం మార్గదర్శకాలను జారీచేశారు. ఈ ప్రక్రియలో కొత్త పోస్టుల మంజూరు, ఉన్న పోస్టుల రద్దు ఉండదని స్పష్టంచేశారు. ఏ యాజమాన్యం వారికి ఆ యాజమాన్యం ఆధారంగానే రేషనలైజేషన్ చేస్తారు. 2020-21 యూడైస్ ఆధారంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ధారిస్తారు. ఇదే విధానంతో మిగులు పోస్టులు, అవసరమయ్యే టీచర్ పోస్టులను నిర్ధారించనున్నారు. జిల్లా స్థాయిలో హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో ఏవైనా సమస్యలుంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు అప్పీలు చేసుకోవచ్చు. ఉత్తర్వులు అందుకున్న 10 రోజుల్లో అప్పీల్ చేసుకోవాలి. బడుల హేతుబద్ధీకరణను జిల్లాస్థాయి కమిటీ చేపడుతుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, ఐటీడీఏ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సభ్యులుగా ఉంటారు.
రేషనలైజేషన్పై ఆందోళన వద్దు
బడుల హేతుబద్దీకరణపై ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దు. బడులు మూయబోమని, పోస్టులు రద్దుచేయబోమని ప్రభుత్వమే జీవోలో స్పష్టంచేసింది. కావున ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం జరగదు. సున్నా విద్యార్థులున్న స్కూళ్లకు సైతం ఒక ఎస్జీటీ పోస్టును కొనసాగిస్తామని జీవోలో ప్రకటించారు. తాజాగా చేపట్టే ప్రక్రియ కేవలం తక్కువ విద్యార్థులున్న చోట ఉన్న టీచర్లను ఎక్కువ విద్యార్థులున్న చోటికి పంపించేందుకే. ఇది మంచి పరిణామం. దీనిని ఉపాధ్యాయులంతా స్వాగతించాలి.
– శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూ