హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : వర్సిటీలు, ఉన్నత విద్యలో మూల్యాంకన ప్రక్రియపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)చేత సమగ్ర అధ్యయనం చేయించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు ఇటీవలే ఐఎస్బీ అధికారులతో విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్ చర్చించారు. ఇందులోభాగంగా ప్రపంచస్థాయి మూల్యాంకన పద్ధతులపై అధ్యయనం చేస్తామని అధికారులు తెలిపారు.
అత్యుత్తమ కరిక్యులం, నిష్ణాతులైన అధ్యాపకులు, ఉత్తమ ముల్యాంకన పద్ధతులు ఉత్తమ విద్యావ్యవస్థకు కొలమానంగా భావిస్తారు. కరిక్యులం, అధ్యాపకుల వంటి అంశాల్లో తెలంగాణ ముందంజలో ఉండగా, తాజాగా ముల్యాంకన విధానంపై అధికారులు దృష్టిపెట్టారు. జవాబుపత్రాల ముల్యాంకనంలో కొన్ని సమయాల్లో విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుండగా, ఇంకొన్నిసార్లు ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు. జేఎన్టీయూ, ఓయూ డిగ్రీ కాలేజీల్లో ఆన్స్క్రీన్ ముల్యాంకాన్ని అనుసరిస్తున్నారు. మరికొన్ని వర్సీటీల్లో జవాబుపత్రాలను అధ్యాపకులచే మూల్యాంకనం చేయిస్తున్నారు. వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.