హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. దేశ,విదేశీ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వరంగ మహారత్న కంపెనీ భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంగళవారం ముందుకొచ్చింది. రూ.1,000 కోట్లతో రాష్ట్రంలో ఇథనాల్ (ఫస్ట్ జనరేషన్) ప్లాంటును ఏర్పాటుచేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 100 ఎకరాల స్థలం, కావాల్సినంత నీరు అందిస్తే ప్లాంటు ఏర్పాటుచేస్తామని తెలిపింది. ప్లాంటు ఏర్పాటుకోసం బీపీసీఎల్ గతంలోనే రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది. తాజాగా మంగళవారం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బయో ఫ్యూయల్స్) అనురాగ్ సరోగి, ఈడీ (ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్) ఎల్ఆర్ జైన్, కృష్ణపట్నం-హైదరాబాద్ పైప్లైన్ ప్రాజెక్టు లీడర్ బీ మనోహర్ నేతృత్వంలోని బృందం పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో సమావేశమైంది.
తమ ప్లాంటు ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ర్టానికి అదేస్థాయిలో పన్నుల రూపంలోనూ ఆదాయం వస్తుందని వివరించింది. ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు 100 ఎకరాల స్థలం, రోజుకు సుమారు 4 వేల కిలోలీటర్ల నీటి సదుపాయం ఉండాలని కోరారు. రాష్ట్రంలో ఇథనాల్ ప్లాంట్కు కావాల్సిన ముడి పదార్థాలు పుష్కలంగా ఉన్నట్టు గుర్తించామని జయేశ్రంజన్కు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సౌకర్యాలు కల్పిస్తే వీలైనంత తొందరలోనే ప్లాంట్ను నెలకొల్పి రోజుకు 5 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తామని ప్రతిపాదించారు. ఇథనాల్ ప్లాంటు ఏర్పాటుకు బీపీసీఎల్కు అన్నిరకాలుగా సహకరిస్తామని జయేశ్రంజన్ తెలిపారు. ప్లాంటుకు జాప్యంలేకుండా అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. బీపీసీఎల్ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరగా అనుమతులు వచ్చేలా చూస్తామని చెప్పినట్టు సమాచారం.
ఇథనాల్ ప్లాంటుకు అవసరమైన ముడి సరుకు రాష్ట్రంలో పుష్కలంగా లభిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నీరు పుష్కలంగా లభిస్తుండటంతో వరి పంట సాగు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువైంది. వరి ధాన్యం భారీగా ఉత్పత్తి అవుతుండటంతో దానిని కొనుగోలు చేసే విషయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)పై ఒత్తిడి పడింది. వరితోపాటు మొక్కజొన్న తదితర పంటలు కూడా పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ కలుపుతుండగా, 2025-26 నాటికి 20 శాతానికి పెంచాలని నీతి ఆయోగ్, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీచేశాయి. దాంతో తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఇథనాల్ పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలను పరిశీలించాలని కేంద్రప్రభుత్వం కొద్దిరోజుల క్రితం చమురు కంపెనీలకు లేఖ రాసింది. దేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తున్న తెలంగాణలో ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని గ్రహించిన బీపీసీఎల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.