బెజ్జంకి, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం శివారులో ‘వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్’ కంపెనీ నిర్మాణం చేపట్టవద్దంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణం కోసం భూమిపూజ చేస్తున్నారని తెలుసుకున్న నర్సింహులపల్లి, ముత్తన్నపేట, శంకర్నగర్ గ్రామస్థులు శుక్రవారం పోతారం శివారుకు తరలివచ్చి ఆందోళన చేపట్టారు.
కాగా పోలీస్ పహారాలో కంపెనీ యజమానులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని, తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పనులు ఆపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.