తమకు తిరిగి ఇప్పించాలని దళిత మహిళా మండలి విజ్ఞప్తి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 7: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులు తమ భూములను ఆక్రమించారని దళిత మహిళా మండలి సభ్యులు ఆరోపించారు. కబ్జాకోరుల నుంచి తమ భూములను విడిపించి, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండలి ముఖ్య సలహాదారు టీ రమణయ్య, అధ్యక్షురాలు ఎం పద్మ, ఉపాధ్యక్షురాలు కే జయలక్ష్మి సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. 1996లో అప్పటి ప్రభుత్వం కూకట్పల్లి మండలం శంషీగూడ గ్రామంలోని సర్వే నంబర్ 56లో 200 మంది దళిత మహిళలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిందని గుర్తుచేశారు. 2001లో నాలుగు ఎకరాల స్థలంలో లే అవుట్ వేసి, ఒక్కొక్కరికి 80 గజాల స్థలాన్ని ఇచ్చినట్టు వివరించారు. లబ్ధిదారులు ఆ భూమిని చదును చేసి, గుడిసెలు నిర్మించుకున్నట్టు చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులు యాంజ్యా ల రాములు, లక్ష్మయ్య, పురుషోత్తం, సహదేవ్ తదితరులు తప్పుడు పత్రాలు సృష్టించి, తమ భూములతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాస్తామని చెప్పారు.