ఆయన సలహాలతోనే బీజేపీకి లబ్ధి
ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై నిపుణుల విస్మయం
హైదరాబాద్, ఫిబ్రవరి 18 : ‘35 ఏండ్ల పాటు ఓడిపోకుండా అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తికి (సీఎం కేసీఆర్) ప్రజల నాడి తెల్వదా? ఇప్పుడు ప్రశాంత్కిశోర్ అవసరం పడిందా? పీకే అవసరం పడిందంటేనే తన కాళ్ల కింది భూమి కదిలిపోతున్నట్టుగా ఆయన గుర్తించారని అర్థం. అంతిమ నిర్ణేతలు ప్రజలే. పీకేలతో నడువదు..’ ఇది బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్య. రాబోయే ఎన్నికల కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ (పీకే) సలహాలను టీఆర్ఎస్ స్వీకరిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో బీజేపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. అవాకులు చవాకులు మొదలుపెట్టారు. ఇక్కడే అసలు విషయం మరిచిపోయారు. అసలు ప్రశాంత్కిశోర్ను తెరమీదికి తెచ్చింది, ఆయన సాయంతో లబ్ధి పొందింది, అవసరం తీరిన తర్వాత వదిలిపెట్టింది బీజేపీయే. ప్రశాంత్కిశోర్ విషయంలో టీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపుతున్న బీజేపీ నేతలు.. మూడువేళ్లు తమవైపు చూపిస్తున్నాయని మరిచిపోయారు.
పీకేను తెచ్చింది బీజేపీ కాదా?
ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్కిశోర్ను నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011లో గుజరాత్కు తీసుకొచ్చారు. పీకేను తన సలహాదారుగా నియమించుకొన్నారు. తొలుత గుజరాత్లో పోషకాహార లోపాన్ని నివారించే ప్రాజెక్టుకు కన్సల్టెంట్గా నియమించారు. తర్వాత 2012లో ఎన్నికల వ్యూహకర్తగా మార్చారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో మరోసారి మోదీ సీఎంగా గెలిచారు. తద్వారా ప్రధానమంత్రి అభ్యర్థిగా మారారు. ఇప్పుడు టీఆర్ఎస్కు పీకే పనిచేయడంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ.. అసలు ఆయనను తెరమీదికి తెచ్చిందెవరో ఎందుకు చెప్పడం లేదు? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
పీకే దయవల్లే ప్రధాని అయ్యారా?
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే ప్రశాంత్కిశోర్తో సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకొన్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 2013 గుజరాత్ ఎన్నికల్లో మోదీ ఓటమి భయంతోనే ప్రశాంత్కిశోర్ సహాయం తీసుకున్నారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్కిశోర్ పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. ఈ లెక్కన పీకే దయ వల్లే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని, మోదీ ప్రధాని అయ్యారని బీజేపీ నేతలు ఒప్పుకొంటారా? అని నిలదీస్తున్నారు.
వాడుకొని వదిలేసింది ఎవరు?
2013 గుజరాత్ అసెంబ్లీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రశాంత్కిశోర్ను బీజేపీ పక్కన బెట్టిన విషయం వాస్తవం కాదా? బీజేపీ చేసిన అవమానం, మోదీ ప్రభుత్వ ప్రజాకంటక పాలన ప్రశాంత్కిశోర్కు ఆగ్రహం తెప్పించాయి. దీంతో 2015 నుంచి ఆయన బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్నారు. బీహార్లో నితీశ్కుమార్, పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ, ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటివారిని అధికారంలోకి తేవడంలో సహాయపడ్డారు. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్కు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల కారణంగా ఏ పార్టీ ఎల్లప్పుడూ అధికారంలోకి రాలేదని.. రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఏ పార్టీకైనా ప్రజల అభిమానం, కార్యకర్తల శ్రమ, నాయకుల భాగస్వామ్యం, అద్భుతమైన వ్యక్తిత్వం, వ్యూహరచన సామర్థ్యం ఉన్న నాయకుడి మార్గనిర్దేశనం అవసరం. సీఎం కేసీఆర్కు కొండంత ప్రజాబలం ఉన్నది. ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించే మెరికల్లాంటి టీఆర్ఎస్ శ్రేణులు, నేతలు అండగా ఉన్నారు. దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్న బీజేపీని ఓడించేందుకు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ మేరకు అవగాహన ఉన్న వ్యక్తి అవసరం పడింది. ఈ నేపథ్యంలోనే పీకేను సంప్రదించారని విశ్లేషకులు అంటున్నారు.