ఢిల్లీలో బీజేపీ ముఖ్యులతో కీలక భేటీ
సంజయ్ ఒంటెత్తుపోకడపై ఫిర్యాదు
హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతల మధ్య అభిప్రాయభేదాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో ఇవి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదని, కనీసం పట్టించుకోవడం లేదని, ఒంటెత్తుపోకడ పోతున్నారని బండిపై సీనియర్ నేతలతో పాటు, ఇటీవల పలు పార్టీల నుంచి వలసవచ్చిన పెద్ద నేతలు సైతం రగిలిపోతున్నారు. ఇప్పటికే దుబ్బాక ఎమ్మెల్యేతోపాటు పలువురు సీనియర్ నేతలు బాహాటంగా తమ ఆవేదనను వెళ్లగక్కారు.
తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం బండిపై తిరుగుబావుటాను ఎగురేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని అవమానాలను భరించిన ఈటల ఏకంగా బండిపై ప్రత్యక్ష పోరుకు దిగినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజాసంగ్రామ యాత్రవైపు కనీసం కన్నెత్తి చూడకుండా నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఒకవైపు సంగ్రామయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు అమిత్షా హైదరాబాద్ వస్తుండగా, తనకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈటల ఢిల్లీకి వెళ్లడం అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. ఢిల్లీలో బీజేపీ జాయింట్ సెక్రటరీ శివప్రకాశ్తో పాటు, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్చుగ్తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. సీనియర్ నేతలను బండి అవమానిస్తున్న తీరుపై, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఈటల ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.