Etamatam | ‘మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్’ అని కన్యాశుల్కంలో గిరీశం అంటాడు. బహుశా గురజాడ ఈ డైలాగ్ రాసింది ఐటీ అధికారులను ఉద్దేశించి అయి ఉంటుందని అనిపించేలా ఉంది. మాజీ లేడీ టైగర్ రేణుకా చౌదరి తాజాగా ఐటీ అధికారులను ఉద్దేశించి ‘మరీ ఒట్టి ఎర్రి బాగుల వెధవల్లా ఉన్నారు’ అని చేసిన వ్యాఖ్య సూపర్ డూపర్గా పేలింది. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రయోగిత ఐటీ అధికారులు, బీజేపేతర అభ్యర్థుల ఇండ్లపై వరుస దాడులు చేస్తున్నారు.
ఆ సందర్భంగా ఎన్నికలలో పంచడానికి దాచిన డబ్బులు ఎక్కడ పెట్టారంటూ… బీరువాలలో చీరల దొంతరలను వెతుకుతున్నారు. ఆడవాళ్లు ఎంతో కష్టపడి పేర్చుకున్న చీరల వరసలను చిందర వందర చేస్తే వాళ్లు ఊరుకుంటారా… చిర్రెత్తి పోరూ?! అందుకేనేమో రేణుకా చౌదరి ఐటీ అధికారులపై ఒంటికాలి మీద లేచింది. ‘ఎర్రి బాగుల వెధవలు మమ్మల్ని తక్కువగా అంచన వేశారు’.. ‘మరి పిచ్చి వెధవలు కాకపోతే ఏంటీ? మీరు వచ్చాక అప్పగిద్దామని ఇళ్లలో నోట్ల కట్టలు పెట్టుకొని కూర్చుంటామా?.. మీరొచ్చి రైడ్ చేయగానే దొరకడానికి? మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు..’ అంటూ మండిపడ్డారు. నిజమే, ఐటీకి సమర్పించిన లెక్కల్లో ఏమైనా తేడా ఉంటే, దాని ఆధారంగా తీగలాగితే డొంక కదిలే అవకాశం లేకపోలేదు. అంతే కానీ, ఎవరి ఇంటిపై దాడి చేయాలని బీజేపీ ఆఫీసులో అందించే పేర్ల ఆధారంగా రైడ్ చేస్తే ఇలాంటి తిట్లు తప్పవు. ఏమన్నా అంటే అన్నారంటారు కానీ…కాస్త అప్డేట్ కండి భాయ్సాబ్!
– వెల్జాల