హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కొత్తగా డిస్పెన్సరీలను వెంటనే ఏర్పాటు చేయాలని, అందుకు అన్ని వసతులతో కూడిన భవనాలను గుర్తించాలని సంబంధిత అధికారులను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. ఈఎస్ఐసీ రీజినల్ బోర్డు మీటింగ్ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఈఎస్ఐసీ వసతులు తదితర అంశాలపై మంత్రి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిస్పెన్సరీల్లో అన్ని వసతులు కల్పించాలని, పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు. ఈఎస్ఐసీలో మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే 15 డిస్పెన్సరీలకు అనువైన భవనాలను గుర్తించి త్వరితగతిన ప్రారంభించాలని చెప్పారు. ఈఎస్ఐసీ నుంచి రూ.442 కోట్లు రావాల్సి ఉండగా, రూ.228 కోట్లు మాత్రమే కేటాయించటంపై అసహనం వ్యక్తం చేశారు. పూర్తి మొత్తంలో నిధులను రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈఎస్ఐసీలతో అనుసంధానించనున్న పీఐపీ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని, వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో బోర్డు సభ్యులు రాజమహేందర్, మల్లేశం, ఎస్ మల్లేశం, మారయ్య, రమణారెడ్డి, ఈఎస్ఐసీ డీన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.