హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అత్యవసర పరిస్థితుల్లో రోగికి అందించే ఐసీయూ (ఇంటెన్సిర్ కేర్ యూనిట్) సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కార్పొరేట్కు దీటుగా బస్తీ దవాఖానల నుంచి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను అందించేందుకు టెలీమెడిసిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే ఐసీయూ సేవలను సైతం వీడియో కాల్ ద్వారా అందించేందుకు నిమ్స్ దవాఖాన కేంద్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
టెలీమెడిసిన్ ద్వారా వైద్యుల కన్సల్టేషన్ ఇస్తున్న తరహాలోనే ఐసీయూ రోగులకు చికిత్స అందించే విధానమే ఈ-ఐసీయూ. ప్రధానంగా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, క్రిటికల్కేర్ నిపుణులు అందుబాటులో లేని ప్రాంతాలకు ఈ సేవలను అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తున్నది. జిల్లా కేంద్రాల్లో ఉండే దవాఖానల్లో ఐసీయూ వార్డులను ఏర్పాటుచేసి అక్కడ ప్రతి బెడ్డుకు కెమెరా, మానిటర్, మైక్ వంటివి ఏర్పాటుచేస్తారు. వీటిని నగరంలోని ప్రధాన దవాఖానకు అనుసంధానం చేస్తారు. ప్రధాన దవాఖాన నుంచి అనుభవజ్ఞులైన వైద్యనిపుణులు జిల్లా దవాఖానల్లోని ఐసీయూలో ఉన్న రోగులను పర్యవేక్షిస్తారు. రోగికి సంబంధించిన వైద్యనివేదికలను ఆన్లైన్ ద్వారా పరిశీలించి, రోగి ఆరోగ్య పరిస్థితిని స్థానిక వైద్యుల ద్వారా తెలుసుకొని అవసరమైన చికిత్సను ఆన్లైన్ ద్వారానే అక్కడి వైద్యులకు సూచిస్తారు. ఆ ప్రకారం స్థానిక వైద్యులు రోగులకు నిపుణులు సూచించిన వైద్యాన్ని అందిస్తారు. ఇలా ప్రతి రోజు మూడు షిఫ్టుల్లో ప్రధాన దవాఖాన నుంచి సీనియర్ వైద్యులు వీడియోకాల్ ద్వారా రోగిని పర్యవేక్షిస్తారు. రోగుల వైద్య నివేదికలను జిల్లా ఐసీయూ కేంద్రాల నుంచి నగరంలోని ప్రధాన దవాఖానకు షేర్ చేసేందుకు, బీపీ, హార్ట్బీట్ వంటివి లైవ్గా పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించినట్టు సమాచారం.
ఈ-ఐసీయూ సేవలు అందించేందుకు హైదరాబాద్లోని నిమ్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి. ఈ కేంద్రం నుంచి ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యనిపుణులు ప్రతిరోజు ఆయా జిల్లాల్లో ఏర్పాటుచేసిన ఈ-ఐసీయూ కేంద్రాలను పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ 24/7 పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, కాలిన గాయాలు వంటి అత్యవసర సేవలను ఈ-ఐసీయూ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
జిల్లాల్లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైనా లేదా గుండెపోటు, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు నగరాలకు తరలించడం సహజం. అలా జిల్లాల నుంచి అంబులెన్స్లో నగరానికి తరలించేందుకు కనీసం మూడు నాలుగు గంటల సమయం పడుతుంది. చాలా సందర్భాల్లో గోల్డన్ అవర్ దాటిపోయి రోగి ప్రాణాలు దక్కే పరిస్థితులు ఉండవు. దీనిని అధిగమించి రోగులకు సకాలంలో అత్యవసర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ-ఐసీయూలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దీనివల్ల రోగి స్థానికంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఉంటూ.. నిమ్స్ నుంచి అత్యవసర వైద్యసేవలు పొందే వీలు ఉంటుంది.
ఈ-ఐసీయూ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టు కింద 15 చోట్ల ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే సిరిసిల్లలో ఈ-ఐసీయూ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పాటు నాగర్కర్నూల్, భద్రాచలం, నిర్మల్, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ-ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.