హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతి భవన్లో మంగళవారం విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డితో సమావేశమైన సీఎం కేసీఆర్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం చేశారు. బోధనా సిబ్బందిని ఈ బోర్డు ద్వారా భర్తీచేయనుండగా, బోధనేతర సిబ్బందిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో 1,062 ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి 2017లోనే ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్పై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. బోధనా సిబ్బంది రిక్రూట్మెంట్ విధానంపై అధ్యయనం చేసేందుకు గతంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ చేసిన సిఫారసుల మేరకు గత ఏప్రిల్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు రూపొందించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు 2020 వరకు ఉన్నట్టు తెలుస్తున్నది.
బీహార్, ఒడిశా తర్వాత మనమే..
వర్సిటీల్లోని పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్బోర్డును ఏర్పాటు చేసిన మూడో రాష్ట్రంగా తె లంగాణ నిలిచింది. ఇప్పటివరకు బీహార్, ఒడిశా ల్లోనే ఈ తరహా బోర్డులున్నాయి. రిక్రూట్మెంట్బోర్డుకు చైర్మన్తోపాటు స భ్యులను నియమిస్తారు. వీసీలు, ప్రొఫెసర్లతో ఈ బోర్డు ఏర్పడుతుందని తె లిసింది. ఈ మేరకు ఉత్తర్వులు త్వరలో విడుదలవుతాయని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ఆర్జీయూకేటీపైనా..
సీఎంతో భేటీ సందర్భంగా ఆర్జీయూకేటీలో ఇటీవల నెలకొన్న పరిణామాలపైనా మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీకి కొత్తగా చాన్స్లర్, వైస్చాన్స్లర్ను నియమించాలని కోరారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
రాత పరీక్ష ద్వారా..
ఇదివరకు యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిని ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేసేవారు. పైగా వర్సిటీల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యేవి. తాజా నిర్ణయంతో రాత పరీక్షను నిర్వహించి, ఫలితాలు ప్రకటించి, మెరిట్ లిస్ట్ను రూపొందిస్తారు. అన్ని వర్సిటీలకు కలిపి ఒకే నోటిఫికేషన్ జారీచేస్తారు. ఉన్నత విద్యామండలి పరిధిలో 11 వర్సిటీలుండగా, పలుశాఖల పరిధిలోని ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ విశ్వవిద్యాలయాలున్నాయి. మొత్తంగా 15 వర్సిటీల్లోని పోస్టులను ఈ రిక్రూట్మెంట్బోర్డు ద్వారానే భర్తీచేస్తారు.