హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : కార్పొరేట్ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం, చర్చల ద్వారా రాజీ, సయోధ్య కుదర్చడం ఆర్బిట్రేషన్ రంగం ప్రత్యేకత. ఈ రంగానికి ఉన్న డిమాండ్ను అంచనావేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ను నెలకొల్పింది. ఈ రంగంలో నిపుణులను తయారుచేసేందుకు హైదరాబాద్లోని జేఎన్టీయూ, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ)లు సంయుక్తంగా ముందుకొచ్చాయి.. ప్రతిష్ఠాత్మకమైన ఈ రెండు విద్యాసంస్థలు ఆర్బిట్రేషన్పై కొత్త కోర్సును ప్రవేశపెట్టాయి. ఏడాది వ్యవధి ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఆర్బిట్రేషన్ ప్రోగ్రాంను ఈఎస్ఐసీ ఈ విద్యాసంవత్సరమే ప్రారంభించింది. ఈ కోర్సు ప్రవేశాల నోటిఫికేషన్ను ఒకట్రెండు రోజుల్లో జారీకానున్నది.
రెండు సెమిస్టర్లు
ఈ కోర్సులో రెండు సెమిస్టర్లుంటాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్, ప్రెషర్స్ ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ కోర్సులో చేరవచ్చు. హైదరాబాద్లోని ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తారు.
అపార అవకాశాలు
ఆర్బిట్రేషన్ రంగంలో అపార అవకాశాలున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సు. కంపెనీలు లీగల్ కన్సల్టెంట్ల తరహాలో ఆర్బిట్రేటర్లను నియమించుకొనే రోజులు వస్తాయి. ప్రస్తుతానికి 60 సీట్లతో ఈ కోర్సును నిర్వహిస్తున్నాం. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తాం. ప్రతిభ కనబరిచిన వారికి సీట్లు కేటాయిస్తాం.
– డాక్టర్ రామేశ్వర్రావు, ఈఎస్ఐసీ, డైరెక్టర్