నిజామాబాద్, ఏప్రిల్ 12 : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానను సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి లతో కలిసి దవాఖానలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, మందుల స్టాక్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు అవసరమైన అన్ని మందులను దవాఖానలోనే ఉచితంగా అందించాలని చైర్మన్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ కు సూచించారు. దవాఖానలోని అమృత్ ఫార్మసీని తనిఖీ చేశారు. జనరిక్ మందులను తగ్గింపు ధరలతో అందించాల్సి ఉండగా, ఈ మేరకు బోర్డు ను సరిగా ప్రదర్శించకపోవడాన్ని గమనించిన చైర్మన్ శ్రీనివాస్ నిర్వాహకుల తీరును తప్పు బట్టారు. తప్పనిసరిగా డిస్కౌంట్ పై మందులు ఇచ్చే విషయాన్ని అందరికి కనిపించేలా బోర్డు పై రాయించాలని ఆదేశించారు.
ఫార్మాసిస్టులు, వైద్యులు సమన్వయాన్ని పెంపొందించుకుని సాధ్యమైనంత వరకు రోగులకు ప్రభుత్వం తరపున పూర్తిగా అన్ని మందులను ఉచితంగా అందించాలని, అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, నిరుపేదలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని హితవు పలికారు.
కాగా, జిల్లా జనరల్ దవాఖాన ఎదురుగా నిర్మించదల్చిన ఎనిమిదంతస్థులతో కూడిన మాతాశిశు విభాగం హాస్పిటల్ (ఎంసీహెచ్) భవన నిర్మాణం అర్ధాంతరంగానే నిలిచిపోయిందని ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీనివాస్ దృష్టికి తెచ్చారు. వీరి వెంట టీఎస్ఎంఎస్ఐడీసీ ఎస్ ఈ దేవేందర్ తదితరులు ఉన్నారు.