హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్-19 ఆంక్షలను కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగసభలను నిషేధించింది. తక్కువ మందితో జరిగే వేడుకలు, ఈవెంట్లకు మాస్కు లేనిదే ఎవరినీ అనుమతించవద్దని స్పష్టంచేసింది. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, నిర్ణీత దూరం పాటించాలని సూచించింది. మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే జరిమానాలను కఠినంగా అమలుచేయాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా, ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రంతో పాటు హైకోర్టు కూడా ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ వేడుకలకు సంబంధించిన ప్రవేశద్వారాల వద్ద శరీర ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా పరీక్షించాలని, ఇందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, కమిషనర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 41 పెరిగింది. ఈ వేరియంట్ను ప్రాథమిక దశలోనే నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకొంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా మరో 140 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజాగా 186 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. 3,499 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 98.89 శాతంగా నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నది. నూతన సంవత్సర వేడుకల పేరిట ప్రజలు ఎక్కువగా గుమికూడవద్దని, ఇంట్లోనే సంతోష క్షణాలను ఆస్వాదించాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కరోనా సోకింది. ఒంట్లో నలతగా ఉండటంతో శనివారం సాయంత్రం పరీక్షలు చేయించకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచనతో మంత్రి ఐసోలేషన్కి వెళ్లి మందులు వాడుతున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో కోరారు. ఐసోలేషన్ పూర్తయ్యే వరకు నియోజకవర్గ ప్రజలకు తన వ్యక్తిగత సిబ్బంది అందుబాటులో ఉంటారని మంత్రి పేర్కొన్నారు.