హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): వేసవిలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పైప్లైన్ల లీకేజీలు, విద్యుత్తు సరఫరాలో సమస్యలపై నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. గురువారం ఆయన మిషన్ భగీరథ ఎండాకాలం సన్నద్ధతపై ఎర్రమంజిల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నల్లా నీరు సరఫరా చేస్తున్నట్టుగానే వేసవిలో కూడా నిరాటంకంగా సరఫరా చేయాలని ఆదేశించారు.
రిజర్వాయర్లలో నీటి నిలువలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్తు సరఫరా, పైప్లైన్ల పర్యవేక్షణకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని, లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టంచేశారు. విద్యుత్తు సమస్య ఏర్పడితే దాని ప్రభావం మంచినీటి సరఫరాపై పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. పంపుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఫిల్టర్బెడ్లు, ట్యాంకులు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీటి సరఫరా కొనసాగాలని స్పష్టంచేశారు.