పాలకుర్తి : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చేతులెత్తేసినా, రైతు పక్షపాతి అయిన కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం నిలబడ్డారని ఎర్రబెల్లి తెలిపారు. పాలకుర్తి ప్రాథమిక రైతు వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వల్మీడి, అయ్యంగారిపల్లె గ్రామాల్లో మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రతి ఏటా రూ. 3 వేల కోట్ల నష్టం వచ్చినా భరిస్తూ, ధాన్యం కొంటున్నామని మంత్రి వివరించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన కేసీఆర్ మహాత్ముడని ఎర్రబెల్లి కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. ఆడబిడ్డకు మేనమామగా కేసీఆర్ కళ్యాణాలక్ష్మి పథకం తెచ్చారని మంత్రి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 500 పెన్షన్ కూడా రావడం లేదని, తెలంగాణలో రూ. 2వేలు, రూ.3 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్దేనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు
దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఎర్రబెల్లి అన్నారు. కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేసిందని, నా బొంది లో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనివ్వనని తేల్చి చెప్పిన మహానుభావుడు సీఎం కేసీఆర్ కేసీఆర్ అని గుర్తుచేశారు. రైతులు, బాగా డిమాండ్ ఉండే ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి సూచించారు. ఎకరాకు లక్షా 40 వేల వరకు ఆదాయం వస్తున్నది. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఆయిల్ పామ్ నర్సరీ, నూనె తీసే ఫ్యాక్టరీ నడిపిస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎర్రబెల్లి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.