హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నిబంధనల వ్యవహారంపై బుధవారం వాదనలు విన్న సుప్రీం కోర్టు, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. గంగిరెడ్డికి బెయిల్ మంజూరు, కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
దీనిపై జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఇదో ఎనిమిదో వింత అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒక్కరోజు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.