రాష్ట్రంలో కొన్నేండ్లుగా విద్యుత్తు చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో క్లీన్ ఎనర్జీ సెస్, బొగ్గు రవాణా చార్జీల రూపంలో భారీగా ఖర్చులు పెరిగాయి. రాష్ట్రప్రభుత్వం సకాలంలో టారిఫ్ సబ్సిడీలు అందిస్తున్నా డిస్కంలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్ని ఒత్తిడులు ఉన్నా అన్ని వర్గాలకు 24 గంటలపాటు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తును డిస్కంలు సరఫరా చేస్తున్నాయి.
–ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్తు ఆదాయ లోటు రూ.10,928 కోట్లు ఉండే అవకాశం ఉన్నదని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్-అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్) నివేదికలో వెల్లడించాయి. మంగళవారం రెండు డిస్కంలు సిరిసిల్ల సెస్ ఈఆర్సీకి 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలను సమర్పించాయి. ఈ సందర్భంగా ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు, సభ్యులు మనోహర్రాజు, బండారు కృష్ణయ్యతో కలిసి మీడియా సమావేశంలో ఏఆర్ఆర్ నివేదికల్లోని వివరాలను వెల్లడించారు. వ్యవసాయరంగానికి ఉచితంగా, ఇతర వర్గాలకు తక్కువ ధరకే విద్యుత్తు అందిస్తుండటంతో ప్రభుత్వం ఇస్తున్న భారీ సబ్సిడీలు పోగా 2022-23లో రూ.10,928 కోట్లు, 2021-22లో రూ.10,624 కోట్ల ఆదాయ లోటు ఉండవచ్చని డిస్కంలు అంచనా వేసినట్టు తెలిపారు.
ఆర్థిక లోటును పూడ్చటానికి డిస్కంలు టారిఫ్ చార్జీల పెంపు ప్రతిపాదనలను సమర్పిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్తు చార్జీలు పెంచే అవకాశం ఉన్నదని శ్రీరంగారావు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. వచ్చే నాలుగు నెలల్లో విద్యుత్తు చార్జీల పెంపు ఉండదని స్పష్టంచేశారు. డిస్కంలు అంచనా వేసిన ఆర్థిక లోటును ట్రూ అప్ చార్జీల ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొన్నేండ్లుగా విద్యుత్తు చార్జీలు పెంచలేదని, ఇదే సమయంలో క్లీన్ ఎనర్జీ సెస్, బొగ్గు రవాణా చార్జీల రూపంలో భారీగా ఖర్చులు పెరిగాయని శ్రీరంగారావు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం సకాలంలో టారిఫ్ సబ్సిడీలు అందిస్తున్నా డిస్కంలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఎన్ని ఒత్తిడులు ఉన్నా అన్ని వర్గాలకు 24 గంటలపాటు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తును డిస్కంలు సరఫరా చేస్తున్నాయని ప్రశంసించారు. డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చార్జీలను పెంచాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. నిబంధనల ప్రకారం టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు పంపించాలని తెలిపారు. వాటిని త్వరగా పంపించాలని డిస్కంలను ఆదేశించారు. టారిఫ్ ప్రతిపాదనలు అందిన తరువాత అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటామని, ఈ ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి 31లోగా ముగిస్తామని వివరించారు.
విద్యుత్తు పంపిణీ సంస్థలకు భారీ నష్టాలు రావటానికి కేంద్రప్రభుత్వ విధానాలే కారణమని ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు ఆరోపించాయి. కేంద్రం క్లీన్ ఎనర్జీ సెస్ను టన్నుకు రూ.50 నుంచి రూ.400 లకు పెంచటంతో యూనిట్ విద్యుత్తుపై అదనంగా 24 పైసల భారం పడిందని తెలిపాయి. థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి తెలంగాణ డిస్కంలు 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాయని, దీని ద్వారా ఏటా రూ.1,200 కోట్ల అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నాయి. గత ఏడేండ్లలో సెస్ భారం రూ.8,400 కోట్లకు చేరిందని వివరించాయి. బొగ్గు ధరను కూడా ఏటా 6 నుంచి 10 శాతం పెంచుతుండటంతో ఏటా రూ. 725 కోట్ల భారం పడుతున్నదని తెలిపాయి. బొగ్గు రవాణా చార్జీలను రైల్వేలు గత నాలుగేండ్లలో 40 శాతం పెంచాయని, కేంద్ర పునరుత్పాదక ఇంధన విధానంవల్ల డిస్కంలపై భారీగా అదనపు భారం పడుతున్నదని తెలిపాయి. ఇదంతా కలిసి భారీ లోటుగా పరిణమించిందని ఏఆర్ఆర్ నివేదికల్లో వెల్లడించాయి.