HomeTelanganaEo Report On Encroached Bhadradri Devasthanam Lands In Ap
ఏపీలో రాములోరి భూముల కబ్జా
ఆంధ్రప్రదేశ్లో ఆక్రమణకు గురైన భద్రాద్రి దేవస్థాన భూములపై ఆలయ కార్యనిర్వహణ అధికారి నివేదిక
ఆక్రమణదారులకు ప్రజాప్రతినిధుల అండ
ఫిర్యాదులు పట్టించుకోని ఎటపాక తాసిల్దార్
గోశాల నిర్మాణానికీ అడ్డంకులు
ఏపీలో ఆక్రమణకు గురైన భద్రాద్రి దేవస్థాన భూములపై ఈవో నివేదిక
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ఆక్రమణకు గురైన భద్రాద్రి దేవస్థాన భూములపై ఆలయ కార్యనిర్వహణ అధికారి నివేదిక
తయారు చేశారు. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు..
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో 917 ఎకరాల భూమిని 1878లో సోమరాజు పురుషోత్తమరాజు రిజిస్టర్ డీడ్ ద్వారా దేవస్థానానికి బహూకరించారు.
అప్పటినుంచి సదరు భూమిని పలువురు ఆక్రమించుకొన్నారు.
ఈ భూముల విషయంలో దేవస్థానానికి వ్యతిరేకంగా రైతులు, గ్రామస్థులు వివిధ కోర్టుల్లో కేసులు వేయగా 100కు పైగా కేసుల్లో దేవస్థానానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి.
ఈ భూములకు దేవస్థానం పేరుతో పట్టాదార్ పాస్పుస్తకాలు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు వచ్చాయి. ఆన్లైన్లో కూడా వివరాలన్నీ దేవస్థానం పేరుతోనే ఉన్నాయి.
రాష్ట్ర విభజన సమయంలో భదాద్రి దేవస్థానాన్ని తెలంగాణకు, భద్రాద్రికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో భూములు ఉన్న ఈ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు.
ఆక్రమణదారుల నుంచి డ్యామేజెస్ ఫర్ యూజ్ అండ్ ఆక్యుపేషన్ చార్జెస్ కింద 2005 నుంచి 2010 వరకు ఎకరాకు రూ.1,000 చొప్పున వసూలు చేయగా 2021-22 నాటికి రూ.4 వేలకు పెంచారు. సదరు రైతులు 2018 నుంచి ఈ చార్జీలు చెల్లించడం లేదు. ఈ చార్జీలు చెల్లించేదిలేదని రైతులు కరాఖండిగా చెప్తున్నారు. దీంతో దేవస్థానానికి రూ.92 లక్షల నష్టం వచ్చింది.
రాష్ట్ర విభజన తరువాత కొందరు ఆక్రమణదారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో సొంత ప్రయోజనాల కోసం భూమిని ఆక్రమించుకొని పక్కా ఇండ్లు నిర్మించారు. ఈ విషయంపై పలుసార్లు ఎటపాక తాసిల్దార్, పోలీస్శాఖకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆక్రమణలు పెరిగిపోయాయి. ఆక్రమణదారులు శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతోపాటు అడ్డుకొన్న దేవస్థాన సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. ఎటపాక స్టేషన్ హౌజ్ ఆఫీసర్కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయలేదు.
దేవస్థాన భూముల రక్షణ కోసం ఏపీ హైకోర్టులో కేసు దాఖలు చేసి 4 నెలలు గడిచినప్పటికీ సంబంధిత 14 శాఖలు రక్షణ చర్యలు చేపట్టలేదు.
దేవస్థానం ఆధీనంలో ఉన్న 110 ఎకరాల భూమిలో దాతల సహకారంతో గోశాల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగకుండా రైతులు, గ్రామస్థులు కోర్టులో కేసులు వేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దేవస్థాన భూముల దురాక్రమణను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదు. దీంతో ఆక్రమణదారులు దేవస్థాన సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. దేవాలయం ఈవో చేసే ఫిర్యాదులను కూడా స్థానిక పోలీస్ అధికారులు తిరస్కరిస్తున్నారు.
ఇటీవల స్థానిక తాసీల్దార్ పురుషోత్తమపట్నం గ్రామంలోని సర్వే నంబర్ 1 నుంచి 101 వరకు గల భూమి మొత్తం దేవస్థానానికి చెందినదని నిర్థారించి లేఖ ఇచ్చారు. ఈ లేఖ తీసుకొని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరితే పోలీస్శాఖ అధికారులు తిరస్కరించారు. దీంతో ఈ భూములపై స్టేటస్కో ఉన్నప్పటికీ ఆక్రమణదారులు భూమిని దున్ని జామాయిల్ తోట వేశారు. అడ్డుకొన్న సిబ్బందిపై దౌర్జన్యం చేస్తున్నారు. దీంతో కంటెంప్ట్ట్ ఆఫ్ కోర్టు దాఖలు చేయడానికి చర్యలు తీసుకొంటున్నాం.
ఆక్రమణదారులందరూ స్థానికంగా పలుకుబడిన కలిగిన వ్యక్తుల అండదండలతో రోజు రోజుకూ అక్రమణలు పెంచుతున్నారు. రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం.