హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో నమోదైంది. తిరుమలేశుడికి బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. 2019 జూన్ నుంచి 2023 అక్టోబరు వరకు దాదాపు రూ.4,800 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, దాదాపు 3885 కిలోల బంగారం డిపాజిట్లు పెరిగాయిని ఈవో వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.1,021 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు. ఇప్పటివరకు 550 ఆలయాలు నిర్మించినట్టు చెప్పారు. 3వేలకు పైగా ఆలయాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. 176 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టామని వివరించారు. వైజాగ్, భువనేశ్వరి, జమ్ము తదితర ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించామని చెప్పారు.
రూ.140 కోట్లతో తిరుమలలో మ్యూజియంను ఆధునీకరిస్తున్నామని, రూ.25 కోట్లతో అలిపిరి నడకమార్గంలో పైకప్పు, రూ.25 కోట్లతో నూతన పరకామణి భవనం, రూ.15 కోట్లతో బర్డ్ దవాఖానలో నూతన వైద్య పరికరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఎస్వీబీసీని విస్తృతంగా భక్తుల్లోకి తీసుకెళ్లామని, భక్తులు స్వచ్ఛందంగా రూ.50 కోట్లకు పైగా విరాళాలు అందించారని చెప్పారు. స్విమ్స్లో రూ.77 కోట్లతో నూతనంగా కార్డియో, న్యూరో బ్లాక్ నిర్మిస్తున్నామని, అదే విధంగా రూ.197 కోట్లతో నాలుగేళ్లలో దశలవారీగా మొత్తం భవనాలను ఆధునీకరిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో 2వేలకు పైగా గుండె ఆపరేషన్లు నిర్వహించామని, 8 గుండె మార్పిడి ఆపరేషన్లు చేశామని, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.175 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు.