గ్లోబర్ మేయర్ల సదస్సులో గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్లో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు 5 మిలియన్ల మొక్కలు నాటడంతోపాటు, 64 వేల హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్ల అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున ప్రవేశపెడుతున్నట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వర్చువల్లో జరిగిన గ్లోబల్ మేయర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం, హరిత పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, అవలంబించాల్సిన లక్ష్యాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, లాస్ఏంజెల్స్ మేయర్ ఎరిగ్ గర్సెట్టి ప్రారంభ సందేశం ఇచ్చారు. ప్రపంచంలోని 40 ప్రముఖ నగరాల మేయర్లు పాల్గొన్న ఈ సదస్సులో మన దేశం నుంచి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికే అవకాశం దక్కింది. సమావేశంలో ఆమె మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్తు వినియోగాన్ని 15 శాతం తగ్గించేందుకు సంప్రదాయ ఇంధన వనరుల ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు సీఎం కేసీఆర్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో బహుముఖవ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ను పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలకు సహకారమందించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కు విజప్తిచేశారు.