హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీలను ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే దరఖాస్తుల డాటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లోని డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేట్ వ్యక్తులను నియమించుకోవాలని సూచించారు. డాటా ఎంట్రీలో ఆధార్నంబర్, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టంచేశారు. తాసిల్దార్లు, ఎంపీడీవోల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగాలని, సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షించాలని సూచించారు. డాటా ఎంట్రీ కోసం రాష్ట్రస్థాయిలో ట్రెయినీ ఆఫ్ ట్రైనర్లకు గురువారం శిక్షణ ఇస్తామని, వారు శుక్రవారం నుంచి జిల్లాస్థాయిలో శిక్షణ ఇస్తారని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పుడు ఇవ్వని వారు మరోసారి దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో నవీన్మిట్టల్, సందీప్కుమార్ సుల్తానియా, రోనాల్డ్ రోస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.