హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలు జూలైలో జరుగనున్నాయి. జూలై నెలను ఎంట్రెన్స్ల సీజన్గా పిలుస్తారు. జూన్ 30న పాలిసెట్తో ప్రవేశ పరీక్షలు మొదలై.. ఆగస్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్తో ముగుస్తాయి. ఇప్పటికే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల కాగా, దరఖాస్తుల స్వీకరణ ముగింపు దశకు చేరుకున్నది. పరీక్షలకు వారం, పది రోజుల ముందు నుంచి హాల్టికెట్లు జారీచేసి, షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. కరోనాతో రెండేండ్లుగా ప్రవేశ పరీక్షల్లో జాప్యం జరుగుతున్నది. తద్వారా సీట్ల భర్తీ కూడా లేటవుతున్నది.
దీని ప్రభావం సెమిస్టర్ పరీక్షలపై పడి విద్యాసంవత్సరాన్ని పొడిగించాల్సి వచ్చింది. ప్రధానంగా ఎంసెట్ను కరోనా కారణంగా 2020లో సెప్టెంబర్లో, 2021లో ఆగస్టులో నిర్వహించారు. ఐసెట్ను 2020లో సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటి తేదీల్లో, 2021లో ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించారు. ఈ ఏడాది కాస్త ముందుగానే ఈ రెండింటితోపాటు అన్ని ప్రవేశ పరీక్షలు జూలైలో జరుగుతుండటం విశేషం. ఆగస్టులో ఫలితాలు ప్రకటించి సాధ్యమైనంత త్వరగా ప్రవేశాలను పూర్తిచేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.