హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): 202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతులకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించగా, ఈ ఏడాది తొమ్మిదోతరగతికి విస్తరిస్తారు. ఇప్పటివరకు 8వ తరగతి చదివిన విద్యార్థులకు తాజాగా 9వ తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని బోధిస్తారు. కాగా, రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని జూన్ 1 నుంచి 9వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది.
ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల సంఖ్య పెంచడం, సమాజాన్ని స్కూళ్లతో అనుసంధానించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. దీనిపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏటా బడుల పునః ప్రారంభానికి ముందే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని వారం, పది రోజుల పాటు విద్యాశాఖ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా జూన్లో బడిబాటను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి గతంలోనే ప్రకటించారు. ప్రాథమిక సమాచారం మేరకు జూన్ 1 నుంచి 9 వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. జూన్ 10, 11న సెలవులు ఉన్నందున 9వరకు నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించిట్టు సమాచారం.