హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లను ఇంగ్లిష్ మీడియం బోధనకు సన్నద్ధం చేయనున్నారు. అందులోభాగంగా మరో విడత టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎస్సీఈఆర్టీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు త్వరలోనే ఎస్సీఈఆర్టీ, బ్రిటిష్ కౌన్సిల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరనున్నది. 2023 -24 విద్యాసంవత్సరంలో 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మాధ్యమాన్ని విస్తరించనున్నారు.
గతంలో అజీం ప్రేమ్జీ వర్సిటీ రూపొందించిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సులో టీచర్లకు నాలుగు వారాల పాటు శిక్షణ ఇచ్చారు. 2022 మార్చి, ఏప్రిల్, జూన్ మాసాల్లో విడతల వారీగా శిక్షణ ఇవ్వగా, 82 వేల మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ శిక్షణ విజయవంతమైంది. దాంతో మరో 5 వారాల పాటు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. అజీం ప్రేమ్జీ వర్సిటీతోపాటు బ్రిటిష్ కౌన్సిల్తోనూ శిక్షణను కొనసాగించాలని అధికారులు ఇటీవలే నిర్ణయించారు.