వరంగల్ : నర్సంపేట్లోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్లో చోటు చేసుకున్న ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నది. నిన్న రాత్రి కాలేజీ వసతి గృహంలోని రెండో అంతస్తులో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంజయ్(18) అనే విద్యార్థిని భవనంపై నుంచి మరో విద్యార్థి తోసేశాడు. వరంగల్లో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు. వరంగల్ ఎంజీఎంకు సంజయ్ మృతదేహాన్ని తరలించారు. మృతుడి సంజయ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వంగపల్లి వాసి. సంజయ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం( EEE ) చదువుతున్నాడు. వరంగల్ ఎంజీఎం వద్ద మృతుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సంజయ్ చనిపోయాడు అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హాస్టల్ రెండో అంతస్తులోని ఓ గదిలో కిటికీ అద్దాలు పగలగొట్టినందుకు వార్డెన్ విద్యార్థులకు ఫైన్ వేశాడు. ఆ ఫైన్ చెల్లించే విషయంలో విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సంజయ్ను మరో విద్యార్థి కిటికీలో నుంచి తోసేశాడు. అయితే గాయపడ్డ సంజయ్ను తక్షణమే ఆస్పత్రికి తరలించి ఉంటే ప్రాణాలతో బతికేవాడని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఘటన జరిగితే.. యాజమాన్యం శనివారం ఉదయం స్పందించింది అని విద్యార్థులు పేర్కొన్నారు. బిట్స్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి హుటాహుటిన క్యాంపస్కు చేరుకుని, సంజయ్ను నర్సంపేటలోని ఓ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.