హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): సాంకేతిక విద్య మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులేస్తున్నదా? ఇంజినీరింగ్కు మళ్లీ డిమాండ్ పెరుగుతున్నదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది టీఎస్ ఎప్సెట్కు భారీగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. ఇంటర్ తర్వాత డిగ్రీకి బదులుగా బీటెక్ వైపు ఆసక్తి చూపుతున్నారు. రెండేండ్ల నుంచి ఈ ట్రెండ్ పెరుగుతుండగా, ఈ ఏడాది డిమాండ్ మరింత పెరిగింది.
ఈ ఏడాది టీఎస్ ఎప్సెట్కు రికార్డుస్థాయి దరఖాస్తులొచ్చాయి. శనివారం వరకు 3.41 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నిరుడు 3.20 లక్షలు రాగా, ఈ ఏడాది ఇప్పటికే 21 వేల దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఎప్సెట్ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. రూ.250 ఆలస్య రుసుముతో ఈ నెల 9, రూ.500తో 14 వరకు, రూ.2,500తో 19వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తంగా దరఖాస్తులు 3.60 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్టు జేఎన్టీయూ అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ దరఖాస్తులు నిరుడితో పోల్చితే కాస్త తగ్గాయి. దరఖాస్తులకు గడువు ఉండటంతో మున్ముందు పుంజుకొనే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇకపై రాసేది హైదరాబాద్లోనే..
ఎప్సెట్కు భారీగా దరఖాస్తులు రావడంతో కొత్తగా దరఖాస్తు చేసే వారికి పరీక్షాకేంద్రాలు కేటాయించలేని పరిస్థితి తలెత్తింది. కొత్తగా దరఖాస్తు చేసేవారు హైదరాబాద్లోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. సెంటర్ల సామర్థ్యం సరిపోక రాష్ట్రంలోని ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను అధికారులు బ్లాక్చేశారు.
ఆదిలాబాద్, కోదాడ, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, పాల్వంచ, సుజాతనగర్, సత్తుపల్లి, జగిత్యాల, కరీంనగర్, హుజూరాబాద్, మంథని, సిద్దిపేట, మహబూబ్నగర్, నర్సాపూర్, సుల్తాన్పూర్, పటాన్చెరు, రుద్రారం, ఆర్మూర్, వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, నర్సంపేట ప్రాంతాల నుంచి సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు రావడంతో జేఎన్టీయూ అధికారులు వాటిని ఎగ్జామ్ సెంటర్లు కేటాయించే జాబితాలో బ్లాక్ చేశారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థులిప్పుడు ఎప్సెట్కు దరఖాస్తు చేస్తే హైదరాబాద్కు వచ్చి రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీ నుంచి భారీగా..
పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఇంటర్ పూర్తిచేసి, ఇంజినీరింగ్లో చేరాలనుకుంటున్నవారిలో అత్యధికులు తెలంగాణలోనే చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్కు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. 2021లో వీరి సంఖ్య 51,848 మత్రమే కాగా, 2022కు వచ్చేసరికి 53,931కు చేరగా, ఇక 2023లో 56,374కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 57,978 మంది అభ్యర్థులు టీఎస్ ఎప్సెట్కు దరఖాస్తు చేశారు. మొత్తంగా దరఖాస్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటం గమనార్హం.