హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో నీరాను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. టూరిజం ప్రాంతాల అధ్యయనంలో భాగంగా ఆయన రోమ్ను సందర్శించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ, ఇటలీ దేశానికి చెందిన ప్రముఖ రచయిత కార్ల్ ఫ్రైడ్రిచ్ ఫిలిప్ ఓన్ మారిషస్ రచించిన ‘బుక్ ఆఫ్ పామ్’ పుస్తకంలో పామ్ ట్రీ ప్రాముఖ్యత గురించి అనేక అంశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు. రోమ్లో జరిగిన కార్యక్రమంలో బుక్ ఆఫ్ పామ్ పబ్లిషర్ తరపున ప్రతినిధులు ఈ పుస్తకాన్ని తనకు అందజేశారని చెప్పారు. పామ్ ట్రీలు అన్ని ప్రాంతాల్లో.. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతాయని పుస్తకంలో రచయిత వివరించారని పేర్కొన్నారు. ఈ చెట్ల ప్రాముఖ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, సీఎం కేసీఆర్ సహకారంతో నీరాకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. నీరా అనేది ఆల్కహాల్హ్రిత పానీయమని, ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు. నీరాతో మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయని, రోగ నిరోధకశక్తి పెరుగుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైందని పేర్కొన్నారు. ఇన్ని మంచి గుణాలు ఉన్న నీరాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించాలనే సంకల్పంతో హైదరాబాద్ నడిబొడ్డున నీరా కేఫ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.