హైదరాబాద్ : వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్లోని శక్తిమాన్ ఇండస్ట్రీని మంత్రి నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలోని బృందం సందర్శించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాగునీటి రాకతో తెలంగాణ కూలీలంతా రైతులుగా మారారు. క్షేత్రస్థాయిలో కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోని 11 రాష్ట్రాల నుంచి వచ్చి వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ అనుబంధ రంగాలలో కూలీలుగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి కూలీల రాక ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయంలో వీలైనంత తొందరగా రైతాంగాన్ని యాంత్రీకరణ వైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో చిన్న కమతాలకు అనుగుణంగా యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్కోట్లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేస్తున్న వ్యవసాయ పరికరాలు, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. రోబోటిక్ టెక్నాలజీతో వ్యవసాయ పరికరాలు తయారు చేస్తున్న శక్తిమాన్ కంపెనీ తెలంగాణలో యూనిట్ నెలకొల్పాలని ఆహ్వానించారు.
ప్రభుత్వపరంగా అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, అగ్రోస్ ఎండీ రాములు, అగ్రోస్ జీఎం రాజమౌళి తదితరులు ఉన్నారు. అంతకు ముందు ప్రముఖ జ్యోతిర్లిగం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.