ఆదిలాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రి మండలి అంగీకారం తెలుపడంతో అందులో చదువుకున్న యువతకు ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ ఉద్యోగాలు లభిస్తాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నిర్మల్లో భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడానికి హరితహారంతోపాటు పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ‘మన ఊరు-మన బడి’ పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందడంతోపాటు కార్పొరేట్ విద్యార్థులతో పోటీపడతారని తెలిపారు.