హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల ఉద్యోగులు గత రెండేండ్లుగా ఇండ్ల నుంచే పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రం హోంతో ముఖం వాచిపోయిన ఉద్యోగులు ఆఫీసు నుంచి కొన్ని రోజులు, ఇంటి నుంచి కొన్నిరోజులు పనిచేసే హైబ్రిడ్ పద్ధతి కావాలని కోరుతున్నారు. ఇటీవలే కొన్ని సంస్థలు మళ్లీ కార్యాలయాల నుంచి పనులు మొదలుపెట్టాయి. కానీ ఇంతలో మరోసారి వైరస్ విజృంభిస్తుండటంతో పని ప్రదేశాల్లో ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పని ప్రదేశాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ అనరాక్తో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆఫీసుల్లో పని విధానంపై ఉద్యోగులు, సంస్థల నిర్వాహకుల వైఖరిని తెలుసుకున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, పుణె తదితర ప్రధాన నగరాల్లో ఐటీ, ఐటీఈఎస్, ఈ-కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులు, కంపెనీల నిర్వాహకుల అభిప్రాయాలు సేకరించారు. హైబ్రిడ్ పద్ధతి (ఆఫీసు నుంచి కొన్ని రోజులు, ఇంటి నుంచి కొన్నిరోజులు), వర్క్ ఫ్రం హోం, ఆఫీస్లో పని అంశాలపై వారి అభిప్రాయాలతో ఒక నివేదిక రూపొందించారు. ఐటీ, ఐటీఈఎస్, ఈ-కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలకు చెందిన అధికశాతం ఉద్యోగులు హైబ్రిడ్ పద్దతివైపే మొగ్గుచూపారు. హెల్త్కేర్, ఔషధ రంగాలవారు మాత్రం ఈ పద్ధతి తమకు అనుకూలం కాదని స్పష్టంచేశారు. హైబ్రిడ్ మోడల్లో ఉద్యోగులు తమ అనుకూలతను బట్టి కొన్నిరోజులు ఆఫీసు నుంచి మరికొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది.
పనిచేయడానికి ఏది అనుకూల ప్రదేశమని అడిగిన ప్రశ్నకు హైబ్రీడ్ పద్ధతి బావుంటుందని 54శాతం మంది మొగ్గు చూపారు. ఆఫీసే అనుకూలమని 33 శాతం, ఇంట్లో నుంచి పని బాగుంటుందని 13 శాతం మంది చెప్పారు. వర్క్ ఫ్రం హోం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నకు ప్రయాణ సమయం, ఖర్చులు మిగులుతాయని 65 శాతం, సౌకర్యవంతంగా ఉంటుందని 16 శాతం, పనిలో సమతుల్యత ఉంటుందని 14 శాతం, భద్రత ఎక్కువని ఐదు శాతం మంది చెప్పారు. ఇదే ప్రశ్నకు హైదరాబాద్కు చెందిన ఉద్యోగులు స్పందిస్తూ, ప్రయాణ ఖర్చులు మిగులుతాయని 70శాతం మంది, ప్రయాణ సమయం ఆదా అవుతుందని 30శాతం మంది తెలిపారు.
వర్క్ ఫ్రమ్ హోంతో ప్రయోజనాలు ఏమిటన్న ప్రశ్నకు 50శాతం మంది కంపెనీల నిర్వాహకులు అద్దెలు మిగులుతాయని తెలిపారు. ఇంటి నుంచి పని చేసే విధానాన్ని ప్రవేశపెడితే ఆ మేరకు కార్యాలయం స్పేస్ను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోం, హైబ్రిడ్ విధానాల్లో విశ్వసనీయతపై 90శాతం కంపెనీలు ఆందోళన వ్యక్తంచేశాయి. తమ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు బయటకు లీక్ అవుతాయని, సైబర్ నేరాలు జరిగే వీలుంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో సరైన రక్షణ వ్యవస్థ, నిఘా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని అధిగమించవచ్చని 10శాతం కంపెనీలు పేర్కొన్నాయి.