హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయిన వీఆర్ఏలకు ఎంప్లాయీ ఐడీలు ఇవ్వాలని ఖజానా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలని మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు వివరాలను పరిశీలించి తక్షణం ఎంప్లాయీ ఐడీలు ఇవ్వాలని ఖజానా శాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
ఇతర శాఖల్లో విధుల్లో చేరిన వారికి వారి పేస్కేల్ ప్రకారం వేతనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు ఒప్పుకోకుండా ఏ శాఖలోనూ చేరనివారికి, ఏదేని కారణం వల్ల ఉద్యోగోన్నతి ఆగిపోయిన వీఆర్ఏలకు గౌరవ వేతనం చెల్లించనున్నది. రెవెన్యూ శాఖలోని వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ నిరుడు జూలై 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారికోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది.
నిరుడు ఆగస్టులో 16,758 మందిని క్రమబద్ధీకరించగా, దాదాపు 15 వేల మంది విధుల్లో చేరారు. అయితే రెవెన్యూ శాఖకు చెందిన 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు (ఓఎస్) హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. దీంతో వారికి ఎంప్లాయీ ఐడీలు ఇవ్వలేదు. వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో పాత వేతనాలు రాక, ఎంప్లాయీ ఐడీలు లేక పే స్కేల్ ప్రకారం కొత్త వేతనాలు దక్కలేదు. నవంబర్లో కోర్టు కేసు ముగిసింది.
పెండింగ్ వేతనాలు చెల్లిస్తారా?
వీఆర్ఏల క్రమబద్ధీకరణ ఈ ఏడాది ఆగస్టులో పూర్తయింది. సాంకేతిక కారణాల వల్ల ఇప్పటివరకూ వారికి వేతనం అందలేదు. తాజాగా ప్రభుత్వం ఎంప్లాయీ ఐడీలు ఇస్తుండటంతో వారు ఊపిరి పీల్చుకొంటున్నారు. అయితే వారికి ఐదు నెలల వేతనం వేస్తారా? లేదా ప్రస్తుతం ఒక నెల వేతనం ఇచ్చి మిగతావి భవిష్యత్తులో ఇస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. అయితే, క్రమబద్ధీకరణ పూర్తయిన ఉద్యోగులకు ఆగస్టు నుంచి వేతనాలు అందించడానికి అభ్యంతరం లేదని రెవెన్యూ శాఖ తాజాగా ఆర్థిక శాఖకు తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమకు ఐదు నెలల వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.