గద్వాల అర్బన్, సెప్టెంబర్ 9: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో విడాకుల కేసు విషయంలో ఉద్వేగ సంఘటన చోటుచేసుకున్నది. నిజాయితీగా తప్పును ఒప్పుకొని భార్య కాళ్లకు మొక్కి భర్త భావోద్వేగానికి గురయ్యాడు. ఇక నుంచి భార్యను మంచిగా చూసుకుంటానని న్యాయవాదుల ముందు మాటిచ్చాడు. దీంతో భార్యాభర్తలు ఒక్కటై దండలు మార్చుకోవడంతో లోక్అదాలత్ చప్పట్లతో మార్మోగింది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద్కు రాజేశ్వరితో వివాహమైంది.
గోవింద్ మద్యం తాగొ చ్చి తరుచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన రాజేశ్వరి పోలీస్స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తరువాత ఈ కేసు రాజీ కోసం లోక్అదాలత్కు చేరింది. జోగుళాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుషా, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి అనిరోజ్ క్రిస్టియన్, సీనియర్ సివిల్ న్యాయమూర్తి గంట కవితాదేవి, జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ నాయక్ సమక్షంలో నిర్వహించిన లోక్అదాలత్లో గోవింద్ భావోద్వేగానికి గురయ్యాడు. మద్యం మత్తులో భార్యపై దాడి చేయడం పొరపాటేనని తన తప్పును నిజాయితీగా ఒప్పుకున్నాడు. న్యా యమూర్తులు సారీ చెప్పాలని కోరగా.. సారీ కాదు.. కాళ్లు మొక్కుతానంటూ భార్య కాళ్లపై పడ్డాడు. ఇకపై ఆమెతో గొడవ పడబోనని గోవింద్ చెప్పాడు. విడాకుల వరకూ వెళ్లిన భార్యాభర్తలు.. లోక్అదాలత్లో ఒక్కటై దండ లు మార్చుకోవడంతో న్యాయమూర్తులు వారి ని ఆశీర్వదించి ఇంటికి పంపించారు.