బేగంపేట్ ఏప్రిల్ 26: గర్భసంచిలో ఏర్పడాల్సిన గర్భం.. గర్భాశయ ముఖద్వారం వద్ద ఏర్పడటంతో ఒక మహిళకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. ఆమెకు ఎంబోలైజేషన్ నిర్వహించి ప్రాణాలు కాపాడినట్టు సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన వైద్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన కరుణకు మొదటి కాన్పు అయిన ఏడాదిన్నర లోపు రెండోసారి గర్భం వచ్చింది. అయితే, అది గర్భాశయ ముఖద్వారం వద్ద ఏర్పడటంతో శిశువు రూపం సంతరించుకోలేదు. గర్భాశయ ముఖద్వారం వద్ద ఉన్న మావి ఆ చుట్టు పక్కల రక్తాన్ని పీల్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆ మహిళకు డాక్టర్ అనంతరామ్ ఆధ్వర్యంలో ఎంబోలైజేషన్ ప్రక్రియలో చికిత్స నిర్వహించినట్టు కిమ్స్ వైద్యులు తెలిపారు.