తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 27: తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఇతోధికంగా సేవలందిస్తున్న ప్రఖ్యాత సాహితీవేత్తలు ఎల్లూరి శివారెడ్డి, జుర్రు చెన్నయ్య కృషిని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి అభినందించారు. స్వయంగా రచనలు చేయడం ద్వారానే కాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా వర్సిటీ, తెలంగాణ సారస్వత పరిషత్తు వంటి సంస్థల ద్వారా తెలుగు భాషాసాహిత్య సంస్కృతుల పరిరక్షణకు ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు.శాంతాబయో టెక్ అధినేత డాక్టర్ కేఐ వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలోని శాంత-వసంత ట్రస్టు ప్రకటించిన ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి, తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని డాక్టర్ జుర్రు చెన్నయ్యకు సోమవారం తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిరంజన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదానంచేశారు. పురస్కార గ్రహీతలను లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, సన్మానపత్రం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ శాంతా బయోటెక్ ద్వారా హెపటైటిస్-బీ వ్యాధులకు వ్యాక్సిన్ తయారుచేయడమే కాకుండా సాహిత్యం, భాషాసంస్కృతులకు వరప్రసాదరెడ్డి అందిస్తున్న సేవ ప్రశంసనీయమన్నారు. సభాధ్యక్షుడు డాక్టర్ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్యల సాహితీసేవను కొనియాడారు.